ఇకపై నేరుగా ఏటీఎం, యూపీఐ నుంచి పీఎఫ్ విత్​డ్రా

ఈపీఎఫ్​ఓ చందాదారులకు గుడ్ న్యూస్​. ఉద్యోగులు తమ ప్రావిడెంట్​ ఫండ్​ (పీఎఫ్​)ను త్వరలో నేరుగా ఏటీఎం, యూపీఐల ద్వారా విత్​డ్రా చేసుకునే అవకాశం రానుంది. అయితే ఇందుకోసం ఉద్యోగులు తమ బ్యాంక్ ఖాతాలను ఈపీఎఫ్​తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.

కార్మిక మంత్రిత్వశాఖ ఈ ప్రాజెక్ట్​పై పనిచేస్తోందని ఓ ఉన్నత స్థాయి అధికారి తెలిపారు. దీని ద్వారా ఇకపై ఉద్యోగుల పీఎఫ్​ ఖాతాలో కొంత భాగాన్ని స్తంభింపజేసి, మిగిలిన డబ్బును యూపీఐ, ఏటీఎం డెబిట్​ కార్డులు మొదలైన వివిధ పద్ధతులు ఉపయోగించి విత్​డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తారని ఆయన అన్నారు. అయితే ఈ వ్యవస్థను అమలు చేయడంలో కొన్ని సవాళ్లు ఉన్నాయని, అందులో భాగంగా ప్రస్తుతం సాఫ్ట్​వేర్ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ​ఆయన చెప్పారు.

ప్రస్తుతం ఎంప్లాయీస్​ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్​ (ఈపీఎఫ్​ఓ) చందాదారులు తమ పీఎఫ్ డబ్బును విత్​డ్రా చేసుకోవాలంటే, ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. దీని వల్ల పీఎఫ్​ డబ్బులు పొందడానికి చాలా సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

రూ.1లక్ష నుంచి రూ.5లక్షలకు పెంపు
ఆటో-సెటిల్​మెంట్ మోడ్ కింద, దరఖాస్తు ఫారమ్​ దాఖలు చేసిన 3 రోజుల్లో పీఎఫ్​ విత్​డ్రా క్లెయిమ్​ను ఎలక్ట్రానిక్​గా పరిష్కరిస్తారు. కనుక మాన్యువల్ పనులు చేయాల్సిన పని తప్పుతుంది.​ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఆటో-సెటిల్​మెంట్ మోడ్​ పరిమితిని మంగళవారం రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. దీని వల్ల ఈపీఎఫ్​ఓ చందదారులకు చాలా ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా విద్య, వివాహం, గృహ అవసరాలకు, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కేవలం 3 రోజుల్లోగా తమ పీఎఫ్​ డబ్బులు పొందగలుగుతారు.